*కల్వకుర్తి లిప్ట్ మోటర్ ఆన్ చేసి నీటిని విడుదల చేసిన మంత్రి జూపల్లి*
నేటి సత్యం. కొల్లాపూర్. జులై 8
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లాలో ఎల్లూరు గ్రామంలోని రేగుమాన్ గడ్డ వద్ద మహాత్మాగాంధీ – కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో భాగంగా చేపట్టిన ఎల్లూరు పంప్ హౌస్ లో మోటర్ ను స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఎంజీఎల్ఐ ప్రాజెక్ట్ లో భాగంగా ప్యాకేజీ 28, 29 & 30 క్రింద ఉన్న ఎల్లూరు, సింగోటం, జొన్నల బొగుడ, గుడిపల్లి గట్టు జలాశయాలను నింపి ఆయకట్టు అవసరాలకు అనుగుణంగా సాగునీటిని విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ… గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి కూడా ప్రాజెక్ట్ లను పూర్తి చేయలేకపోయిందని అన్నారు. పాలమూరు – రంగారెడ్డి, మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఏ ప్రాజెక్ట్ లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కాగితాలపై జిల్లా ఆయకట్టును 4.60 లక్షల ఎకరాలకు పెంచారు తప్ప నీటి విడుదలకు అవసరమైన పనులు చేపట్టలేదని తెలిపారు. కాలువల్లోనీటి ప్రవాహ సామర్ద్యం పెంచలేదని, మోటర్లు ఏర్పాటు చేయలేదని, 5 మోటర్లలో 2 మోటర్లు కాలిపోయిన పట్టించుకోలేదని ద్వజమెత్తారు. ఈ జిల్లా ప్రాజెక్ట్ లను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అప్పటి సీయం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని చెప్పారు.
ఇప్పుడు సాగునీటి ప్రాజెక్ట్ లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతల అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని వెల్లడించారు. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్ లను పూర్తి చేసి చివరి ఆయకట్టుకు నీరందస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు , డా.రాజేష్ రెడ్డి గారు ,మెఘారెడ్డి గారు , సీఈ విజయభాస్కర్ రెడ్డి గారు ,ఎస్ఇ సత్యనారాయణ రెడ్డి గారు ,ఈఈలు శ్రీనివాస్ రెడ్డి గారు మాణిక్ ప్రభు గారు , చంద్రవేఖర్ గారు , మరళీ గారు , తదితరులు పాల్గొన్నారు.
