Neti Satyam
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 6:26 am Editor : Admin

దోమల నివారణకు కఠిన చర్యలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం సరూర్‌నగర్ చెరువు పరిసరాల్లో దోమల నివారణకు కఠిన చర్యలు – అధికారులను ఆదేశించిన గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..!!!

ఈరోజు ఉదయం సరూర్‌నగర్ చెరువు వద్ద గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, GHMC ఎంటమాలజీ విభాగం అధికారులతో కలిసి ఆంటి లార్వా స్ప్రే మరియు దోమల నివారణ పనులను పరిశీలించారు. చెరువు పరిసర ప్రాంతాల్లో దోమల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు.

సరూర్‌నగర్ చెరువు దిగువ ప్రాంతంగా గడ్డిఅన్నారం డివిజన్ ఉండటంతో, చెరువులో మురుగు నీరు పూర్తిగా నిండిపోవడం వల్ల పరిసర కాలనీల్లో దోమల విపరీతంగా పెరుగుతున్నాయని కార్పొరేటర్ గారు తెలిపారు. దోమల కారణంగా ప్రజలు జ్వరాలు, వైరల్ ఫీవర్లు వంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

అదేవిధంగా గత వినాయక చతుర్థి సందర్భంగా సరూర్‌నగర్ చెరువులోకి వేసిన వినాయక విగ్రహాల వ్యర్థాలు, పూజా సామగ్రి, ఇతర చెత్త ఇప్పటివరకు పూర్తిగా తొలగించకపోవడం వల్ల నీరు కలుషితమై దోమల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారిందని కార్పొరేటర్ గారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అంశాలపై GHMC SE అశోక్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ రఘు ప్రసాద్ గారికి గడ్డిఅన్నారం డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న దోమల సమస్యను కార్పొరేటర్ గారు సవివరంగా వివరించారు. ప్రస్తుతం వారానికి ఒకసారి మాత్రమే జరుగుతున్న దోమల ఫాగింగ్ సరిపోదని, దోమల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వారానికి కనీసం మూడుసార్లు ఫాగింగ్ నిర్వహించాలని అధికారులను డిమాండ్ చేశారు. అలాగే ఆంటి లార్వా స్ప్రే పనులు నిరంతరం చేపట్టాలని సూచించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారి ఆదేశాలపై అధికారులు సానుకూలంగా స్పందించారు. చెరువులో వ్యర్థాలను తొలగించే కాంట్రాక్టర్ కాలపరిమితి ముగియడం వల్ల పనులు ఆలస్యమయ్యాయని, అయితే వెంటనే కొత్త కాంట్రాక్టర్లతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన వ్యర్థాల తొలగింపు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఫాగింగ్ మరియు దోమల నియంత్రణ పనుల సంఖ్యను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గడ్డిఅన్నారం డివిజన్ ప్రజల ఆరోగ్యం, భద్రత తనకు అత్యంత ప్రాధాన్యమని, దోమల సమస్య పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకు అధికారులతో సమన్వయం చేస్తూ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తానని కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో GHMC ఎంటమాలజీ ఏ.ఈ రామ్ బాబు, సూపెర్వైసోర్ అర్జున్ మరియు బీజేపీ సీనియర్ నాయకులు చిలకూరి రామ్ రెడ్డి, బీజేపీ డివిజన్ అధ్యక్షులు దాసరి జయ ప్రకాష్, రత్నం, సిద్దు మరియు తదితరులు పాల్గొన్నారు.