(adsbygoogle = window.adsbygoogle || []).push({});
లక్ష్మీ దేవర బోనాల వేడుకల్లో పాల్గొన్న కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి*
కోటపల్లి మండలం రాజారాం గ్రామంలో నిర్వహించిన లక్ష్మీ దేవర బోనాల వేడుకల్లో రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి గారు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. డప్పు చప్పులతో, సంప్రదాయ నృత్యాలతో గ్రామస్తులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీ దేవర అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అమ్మవారి దయతో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాజారాం గ్రామానికి గత ఇరవై సంవత్సరాలుగా రోడ్డు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఎన్నికల సమయంలో తన దృష్టికి తీసుకువచ్చినట్టు గుర్తు చేశారు. అటవీ శాఖ అనుమతులు లభించకపోవడమే రోడ్డు నిర్మాణానికి ప్రధాన అడ్డంకిగా మారిందని తెలిపారు.
ఈ సమస్య పరిష్కారానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారి సహకారంతో ఢిల్లీలో కేంద్ర స్థాయి పెద్దలను కలిసి అటవీ శాఖ అనుమతులు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేసినట్టు మంత్రి తెలిపారు. రాజారాం గ్రామంలో ఈ నెల 17వ తేదీన సెంట్రల్ ఫారెస్ట్ టీమ్ పర్యటించి అటవీ భూముల సర్వే నిర్వహించి, రోడ్డు నిర్మాణానికి అవసరమైన స్థల హద్దులు చూపినట్టు వివరించారు.
ఇప్పటికే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గారిని కలిసి రోడ్డు నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు ఇవ్వాలని కోరినట్టు, మరోసారి కలసి పర్మిషన్లు మరియు నిధులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అటవీ శాఖ అనుమతులు తీసుకురావడం కష్టమైనప్పటికీ, చెన్నూరు నియోజకవర్గంలో ఇప్పటికే రెండు రోడ్లకు అటవీ శాఖ అనుమతులు తీసుకువచ్చిన అనుభవం ఉందని పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాజారాం గ్రామానికి అతి త్వరలో రోడ్డు సౌకర్యం కల్పిస్తామని, ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి భరోసా ఇచ్చారు. రాజకీయాల్లో సేవ భావనతో పనిచేయాలని తన తండ్రి కాక వెంకటస్వామి గారు ఎప్పుడూ చెప్పేవారని గుర్తు చేస్తూ, ఆయన స్ఫూర్తితోనే గ్రామాల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపుతున్నానని అన్నారు. ప్రజల ప్రేమాభిమానాలు ఎప్పటికీ తనపై ఉండాలని కోరారు.