Neti Satyam
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 7:32 am Editor : Admin

ఉపాధ్యాయుల పోరుబాట




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఉపాధ్యాయుల పోరుబాట

నేటి సత్యం 6 ఫిబ్రవరి 26

– జంతర్‌ మంతర్‌ వద్ద భారీ ధర్నా – టెట్‌ తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేయాలి

– సిపిఎస్‌ రద్దు చేయాలి – పాఠశాలల మూసివేత, విలీనాన్ని నిలిపివేయాలంటూ నినాదాలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆల్ఇండియా జాయింట్‌యాక్షన్‌ కమిటీ ఆఫ్‌ టీచర్స్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎఐజెఎసిటిఒ) ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఉపాధ్యాయులు భారీ ధర్నాతో కదంతొక్కారు. టెట్‌ తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేయాలని, సిపిఎస్‌ రద్దు చేయాలని, పాఠశాలల మూసివేత, విలీనాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ దేశ రాజధానిలో వారు నినాదాలతో హోరెత్తించారు.. జాతీయస్థాయి ఉపాధ్యాయ సంఘాలన్నీ మొదటిసారిగా ఒకే వేదికపైకి వచ్చి, పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి గొంతెత్తడం గమనార్హం. ఈ ధర్నాకు సి.ఎన్‌ భారతి (ఎస్‌టిఎఫ్ఐ), కె నరసింహారెడ్డి (ఎఐఎస్‌టిఎఫ్‌), బసవరాజ్‌ గురికార్‌ (ఎఐపిటిఎఫ్‌), సి.ఎల్‌ రోజ్‌ (ఎఐఎఫ్‌టిఒ)లు అధ్యక్షత వహించారు. దీనికి సిపిఎం ఎంపీలు జాన్‌ బ్రిట్టాస్‌, వి. శివదాసన్‌, సెల్వరాజ్‌ (సిపిఐ), కుమార్‌ నాయక్‌ (కాంగ్రెస్‌), రాజారాం సింగ్‌ (సిపిఐ(ఎంఎల్‌) సంఘీభావం తెలిపారు. పార్లమెంటులో ఈ సమస్యలను లేవనెత్తుతామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎఐజెఎసిటిఒ ఏర్పాటును ఒక ముందడుగుగా పేర్కొన్నారు. పలు ఉపాధ్యాయ సంఘాలు మధ్య సాధించిన ఐక్యతను ప్రశంసించారు. ఈ ఐక్య వేదిక దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల స్వరం, సంకల్పాన్ని సూచిస్తుంద న్నారు.. ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ మిగతా 7లో

సర్వీస్‌ ఉన్న (ఒకటి నుంచి ఎనిమిదో తరగతులకు) ఉపాధ్యాయులు రెండేళ్లలోపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు తీర్పు నిర్దేశిస్తుందని, అలా చేయకపోతే వారు సర్వీస్‌ నుండి తొలగించాలని పేర్కొనడం దారుణమన్నారు. ఇది విద్యా హక్కు చట్టం అమలు తరువాత జారీ చేసిన 2010 ఆగష్టు నాటి ఎన్సిటిఈ నోటిఫికేషన్‌కు విరుద్ధమన్నారు. ఇది ఆ నెల తరువాత నియామకం అయిన వారకే టెట్‌ తప్పనిసరి చేసిందని, అన్ని సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చిందని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిని అనుసరించాయని, గత 15 ఏళ్ళుగా సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులు టెట్‌ కి హాజరు కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ వాస్తవాలను సుప్రీంకోర్టు ముందు తగినంతగా సమర్పించడంలో ఎన్సిటిఈ విఫలమైందని విమర్శించారు. కేంద్రీకరణను వేగవంతం చేస్తూ పేదలకు విద్యను అందుబాటులో లేకుండా చేస్తున్న ఎన్ఇపి-2020 ఉపసంహరించు కోవాలని, పాఠశాలల మూసివేత, విలీనాన్ని వెంటనే నిలిపివేయాలి (గత ఐదు సంవత్సరాలలో లక్షకు పైగా పాఠశాలలు మూసివేశారు), ఎంఎల్‌సి ఎన్నికలలో ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలి. జీతం పొందే ఉద్యోగులపై ఆదాయపు పన్ను భారాన్ని తగ్గించాలి. తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వారికి కనీస వేతనాలను అమలు వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎఐజెఎసిటిఒ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. కేంద్ర ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైతే, ఈ ఉపాధ్యాయ ఐక్య ఫ్రంట్‌ను మరింత బలోపేతం చేస్తామని హెచ్చరించింది. ఈ ధర్నాలో ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బి. గోపీమూర్తి, సిపిఐ జాతీయ నాయకులు కె. నారాయణ, తెలంగాణ ఎమ్మెల్సీ శ్రీపాల్‌ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌, ఎఐజెఎసిటిఒ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు చావా రవి (ఎస్‌టిఎఫ్ఐ), సదానందం గౌడ్‌ (ఏఐఎస్‌టిఎఫ్‌), కమల కాంత్‌ త్రిపాఠి (ఏఐపిటిఎఫ్‌), రామ్మూర్తి స్వామి (ఏఐఎఫ్‌టిఓ), పి. దామోదర్‌ రెడ్డి (ఏఐఎఫ్‌టిఓ), ప్రపంచ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షుడు అమియాకుమార్‌ మొహంతి, ఏఐఎఫ్‌యుసిటిఓ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ అరుణ్‌ కుమార్‌, ఏఐఎఫ్ఆర్‌ టిఈ కార్యదర్శి ప్రొఫెసర్‌ వికాస్‌ గుప్తా, ఏఐఎస్ఈసి కార్యదర్శి శారద దీక్షిత్‌, ఎఐఐటిఎ అధ్యక్షుడు రిజ్వాన్‌ తదితరులు ప్రసంగించారు.