Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogకుల రకాసి ముందు కూలిన మానవత్వం

కుల రకాసి ముందు కూలిన మానవత్వం

కుల రక్కసి ముందు కూలిన మానవత్వం

పాడె మోయలేని ఊరు.. మౌనంగా నిలిచిన వ్యవస్థ!

మరణం కూడా విముక్తి ఇవ్వలేకపోయిన దారుణం ఇది. జీవించి ఉన్నప్పుడు సామాజిక బహిష్కరణ… చనిపోయిన తరువాత కూడా అదే శిక్ష! కులం అనే రక్కసి ఎంత క్రూరంగా మారిందో చెప్పే ఘటన ఇది. కొన్నిసార్లు ఒక చిన్న అపోహ… ఒక ఇంటిని ఒంటరిగా చేస్తుంది. ఒక తప్పుడు భయం… ఒక ఊరినే మానవత్వం లేని స్థితికి నెట్టేస్తుంది. కందెనకుంటలో జరిగిన ఘటన అలాంటిదే. ఇది ఎవరో ఒకరిపై విధించిన సామాజిక బహిష్కరణ కథ కాదు. కులాంతర వివాహం అనే ‘పాపం’ను తలచుకుని, ఒక నిరపరాధ కుటుంబాన్ని సమాజం నుంచి దూరం చేసిన దుర్మార్గం. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని కందెనకుంట గ్రామంలో నివసించే ఎదుల రాజేశం అనారోగ్యంతో మృతి చెందాడు. కానీ అతని మరణానికి ముందు, అతని ఇంటిపై ఊరి ముద్ర పడింది. కారణం.. వేరే గ్రామానికి చెందిన అతని సమీప బంధువు ఒకరు కులాంతర వివాహం చేసుకుని, కందెనకుంటలోని ఎదుల రాజేశం ఇంటికి రావడం.

అంతే… ఆ వ్యక్తినే గ్రామస్తులు సాంఘిక బహిష్కరణ చేశారు. అంతటితో ఆగకుండా.. “ఎదుల రాజేశం ఇంటికి ఎవ్వరూ వెళ్లకూడదు” అంటూ గ్రామ పెద్దలు హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఈ హుకుం భయంగా మారింది. భయం మౌనంగా మారింది. ఆ మౌనం చివరికి ఒక మృతదేహం పాడెను కూడా ఒంటరిగా నడిపించింది.

ఎదుల రాజేశం మృతి చెందిన తరువాత, ఆఖరి చూపుకు కొందరు బంధువులు వచ్చినా… పాడె మోయడానికి, అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. “ఊరి పెద్దల ఆజ్ఞకు విరుద్ధంగా వెళ్తే మాకూ అదే గతి పడుతుంది” అన్న భయం అందరినీ వెనక్కి నెట్టింది. చివరికి మృతుడి భార్య, ఆడపడుచులు, మరో ఇద్దరు పురుషులు కలిసి పాడె మోయాల్సి వచ్చింది. శవయాత్రలో మృతదేహంపై మురుమురాలు చల్లే బాధ్యత ఒక చిన్న బాలుడి చేతుల్లోకి వెళ్లిన దృశ్యం.. మనసును చీల్చింది. ఇది ఎవరో చేసిన తప్పుకు విధించిన శిక్ష కాదు. ఇది కులాంతర వివాహాన్ని అంగీకరించలేని మనస్తత్వానికి ప్రతీక. ఇది 100 శాతం గిరిజన గ్రామమని చెప్పుకునే ఊరిలోనూ, కులం ఎంత పాతుకుపోయిందో చూపే నిదర్శనం. ఇక్కడ ప్రశ్నలు మరింత లోతుగా ఉన్నాయి. ఒక వ్యక్తి ఇంటికి వెళ్లొద్దని గ్రామ పెద్దలు హుకుం జారీ చేసే అధికారం ఎవరిచ్చారు? అలాంటి హుకుం చట్టానికి విరుద్ధమని తెలిసినా.. గ్రామ కార్యదర్శి ఎందుకు స్పందించలేదు?

పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇది సంప్రదాయం కాదు… ఇది రాజ్యాంగ విరుద్ధం.

కులాంతర వివాహం నేరం కాదు.

ఆ వివాహం కారణంగా ఒక ఇంటిని సామాజికంగా ఒంటరిగా చేయడం.. నేరం.

అంత్యక్రియల్లో పాల్గొనకుండా అడ్డుకోవడం.. నేరం. భయంతో నోరు మూసుకోవడం.. సమాజంగా మన వైఫల్యం. కందెనకుంట ఘటన ఒక హెచ్చరిక. ఈరోజు ఒక ఇంటి పాడె ఒంటరిగా నడిచింది. రేపు ఇంకో ఇంటి తలుపులు మూసుకుంటాయి. అప్పుడు కూడా మనం “ఊరి ఆచారం” అంటూ తప్పించుకుంటామా? పాలన కదలాలి. ఈ ఘటనపై లోతైన విచారణ జరగాలి. గ్రామ పెద్దల పేరుతో జారీ చేసిన అక్రమ ఆజ్ఞలపై చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబానికి భద్రత, మానసిక భరోసా కల్పించాలి. చివరగా ఒక చేదు నిజం.. కులాన్ని కాపాడుకున్న ఊరు, మానవత్వాన్ని కోల్పోయింది. ఈ కథనం మనల్ని ఒక్క ప్రశ్న అడుగుతోంది.. మనం ఇంకా ఎంతకాలం ఇలాంటి మౌనానికి సహకరిస్తాం?

 

#కులవివక్ష

#మానవత్వం

#సామాజికబహిష్కరణ

#కులాంతరవివాహం

#మనసుమారాలి

#సమాజంబాధ్యత

#అంత్యక్రియలు

#న్యాయంకోసం

#గ్రామరాజకీయం

#మౌనంమానవత్వంకాదు

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments