Neti Satyam
Newspaper Banner
Date of Publish : 24 February 2026, 6:34 am Editor : Admin

కుమ్మెర జాతర ఘటన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి లావణ్య




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కుమ్మెర జాతర ఘటనలో హత్యా కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలి – డి హెచ్ పి ఎస్ జాతీయ సమితి సభ్యులు పొన్నగంటి లావణ్య డిమాండ్

నేటి సత్యం ఫిబ్రవరి 24

భూపాలపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన జాతర సందర్భంగా రజక, దళిత కుటుంబాలపై జరిగిన పాశవిక దాడిని డి హెచ్ పి ఎస్ (దళిత హక్కుల పోరాట సమితి) జాతీయ సమితి సభ్యులు పొన్నగంటి లావణ్య తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో ఒక చిన్నారి మృతి చెందడం అమానుషమని పేర్కొన్నారు.

కుమ్మెరలో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన సందర్భంగా, దర్శనానికి వెళ్లిన దళిత రజక కుటుంబాల మహిళలను కొంతమంది అగ్రకుల భూస్వాములు గుడిలోకి రానీయకుండా అడ్డుకున్నారని తెలిపారు. “100 రూపాయలు ఇస్తేనే లోపలికి అనుమతిస్తాం” అంటూ అవమానకరంగా ప్రవర్తించారని, డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన మహిళలను “తక్కువ జాతి వాళ్లు” అంటూ దుర్భాషలాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళలను గుడి ప్రాంగణం నుంచి కిందికి తోసేసి, సమీపంలోని కొబ్బరికాయల గోడౌన్‌లోకి తీసుకెళ్లి కాళ్లతో, రాడ్లతో దాడి చేశారని తెలిపారు. మౌనిక అనే మహిళ ఒడిలో ఉన్న చిన్న పాపను పక్కన పెట్టి మహిళలు కాళ్లపై పడి వేడుకున్నా కనికరం చూపలేదని పేర్కొన్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ చంటిపాప అనంతరం మృతి చెందడం అత్యంత దారుణమని అన్నారు.

ఈ ఘటనకు కారణమైన శ్రీనివాసరెడ్డి, మధు రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి తదితరులపై భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103 కింద హత్యా కేసు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దళితులపై జరిగిన దాడి కాబట్టి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసులు నమోదు చేయాలని కోరారు.

ఫిర్యాదు చేసినప్పటికీ నాగర్ కర్నూల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం, అరెస్టులు చేయకుండా బాధితులపైనే కేసులు మోపడం అనేది దుర్మార్గ చర్య అని లావణ్య విమర్శించారు. ఈ ఘటనలో బాధ్యత వహించిన ఎస్‌ఐ, సీఐలను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.దాడి చేసిన వ్యక్తులు అధికార పార్టీకి చెందినవారని, అందువల్ల కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, పోలీసులు ఇప్పటికైనా స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని పొన్నగంటి లావణ్య హెచ్చరించారు.