Neti Satyam
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 6:01 am Editor : Admin

సామాజిక పోరాటాలను ఉదృతం చేయాలి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సామాజిక పోరాటాలను ఉదృతం చేయాలి.

– మారుపాక అనిల్ కుమార్, డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

మహబూబ్ నగర్ : దేశంలో దళితులు, బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలు, వివక్షలు రోజురోజుకూ పెరుగుతున్నాయని దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్ ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. దళిత హక్కుల పోరాట సమితి( డి హెచ్ పి ఎస్) మహబూబ్ నగర్ రెండవ జిల్లా మహాసభలు జీ శ్రీనివాస్ అధ్యక్షతన సురవరం వెంకటరామిరెడ్డి భవన్ లో జరిగింది. ఈ మహాసభల ప్రారంభ సూచికగా బి లక్ష్మీపతి జెండా ఆవిష్కరించారు.. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కలలుగన్న సమానత్వ సమాజ నిర్మాణం ఇంకా దూరంలోనే ఉందని ఆయన పేర్కొన్నారు.సమాజంలో కుల వివక్ష, సామాజిక అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయని, దళితులపై దాడులు, భూస్వామ్య దోపిడీలు, అణచివేతలు తరచూ జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వాలు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను పూర్తిగా అమలు చేయడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు. ప్రత్యేకంగా దళితులకు కేటాయించాల్సిన సబ్ ప్లాన్ నిధులు సరైన విధంగా ఖర్చు చేయకుండా ఇతర అవసరాలకు మళ్లించడం తీవ్రమైన అన్యాయమని అన్నారు.దళితుల భూమి సమస్యలు, ఉపాధి సమస్యలు, విద్యా అవకాశాల లోపం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ చేయకపోవడం వంటి సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం సామాజిక ఉద్యమాలను బలంగా నిర్మించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. డాక్టర్ అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రజాస్వామ్యపరమైన పోరాటాల ద్వారా మాత్రమే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, దళితులు, ప్రజాస్వామ్య వాదులు, ప్రగతిశీల శక్తులు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన కోరారు. గ్రామం నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రజా ఉద్యమాలను నిర్మించి దళితుల హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, సమానత్వ సమాజ నిర్మాణం లక్ష్యంగా దళిత హక్కుల పోరాట సమితి (DHPS) రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తుందని మారుపాక అనిల్ కుమార్ తెలిపారు. దళితులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ పోరాటాల్లో భాగస్వామ్యం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డి హెచ్ పి ఎస్ రాష్ట్ర రెండవ రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 17 18 సాయి కన్వెన్షన్ వరంగల్ జిల్లాలో జరగనుంది. మహా సభలను జయప్రదం చేయవలసిందిగా అనిల్ కుమార్ పిలుపునిచ్చారు.