(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం హైదరాబాద్ మే 28
బెనిఫిట్ షోలు ప్రత్యేక షోలు అంటూ. సాధారణ ప్రజలపై అదనపు భారం మోపడం సమంజసం కాదు డాక్టర్ కే నారాయణ
సినీ ప్రముఖులు మేఘస్టార్ చిరంజీవి గారి ఇంట్లో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపినట్టు టీవీల ద్వారా తెలిసింది. అందులో ముఖ్యంగా సినిమా విడుదల సమయంలో ప్రభుత్వాలు ప్రత్యేక అనుమతులతో టికెట్ల ధరలు పెంచడం, ఆ పెరిగిన మొత్తంలో వాటాలపై చర్చలు జరుగుతున్నాయనే వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
పెద్ద సినిమాలకు భారీ ఖర్చులు అవుతున్నాయనే పేరుతో “బెనిఫిట్ షోలు”, “ప్రత్యేక షోలు” అంటూ సాధారణ ప్రజలపై అదనపు భారం మోపడం సమంజసం కాదు. కళల పేరుతో ప్రజల జేబులు ఖాళీ చేయడం సరైన విధానం కాదు. సినిమా ఒక వినోద మాధ్యమం. అది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి గానీ, కొద్దిమంది వ్యాపార ప్రయోజనాలకు వేదిక కాకూడదు.
ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే, ఒక సినిమా విడుదలైతే కుటుంబంతో కలిసి థియేటర్కు వెళ్లాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ భారాన్ని మోస్తున్నది సామాన్య ప్రజలే. టికెట్ల ధరలు పెంచడం ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలో ఎవరికి ఎంత వాటా అన్న చర్చలు జరగడం మరింత విడ్డూరంగా ఉంది.
రాష్ట్ర ప్రభుత్వాలకు సినిమా టికెట్ ధరల విషయంలో స్పష్టమైన, పారదర్శకమైన ఒకే విధమైన పాలసీ ఉండాలి. ప్రతి సినిమా పేరుతో ప్రత్యేక అనుమతులు ఇవ్వడం, ధరలు పెంచడం వంటి చర్యలను నియంత్రించాలి. కళల అభివృద్ధి పేరుతో దోపిడీకి తావు ఇవ్వకూడదు.
ఇలాంటి అధిక ధరలు, అన్యాయమైన టికెట్ వ్యవస్థల వల్లనే ప్రజల్లో అసంతృప్తి పెరిగి “ఐ బొమ్మలు” వంటి ప్రత్యామ్నాయ సంస్కృతి పుట్టుకొస్తోంది. ప్రజల ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి.