(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం శేర్లింగంపల్లి జూన్ 21
గుండ్ల సింగారంలో కూల్చిన గుడిసెల స్థలంలోనే ఇళ్ల నిర్మాణానికి వెంటనే అనుమతులు ఇవ్వాలి
*టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు*
గుండ్ల సింగారం ప్రాంతంలో పేదల గుడిసెలను కూల్చివేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఆ నిరుపేద కుటుంబాలను రోడ్డున పడేసి చేతులు దులుపుకోవడం అమానుష చర్య అని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంవత్సరాలుగా అక్కడ నివసిస్తూ జీవనం సాగిస్తున్న పేదల గుడిసెలను కూల్చివేసి, వారికి ప్రత్యామ్నాయ వసతి కల్పించకుండా నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు. ఒకవైపు పేదలకు ఇళ్లు ఇస్తామని గొప్పలు చెప్పుకుంటూ, మరోవైపు ఉన్న నివాసాలను కూల్చివేసి కుటుంబాలను వీధిన పడేయడం సిగ్గుచేటని విమర్శించారు.
కూల్చివేసిన అదే స్థలంలో బాధిత కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదల కన్నీళ్లపై అభివృద్ధి పేరుతో బుల్డోజర్లు నడపడం ఎంతమాత్రం సమర్థనీయం కాదన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి గుండ్ల సింగారం బాధితులకు గృహ నిర్మాణ అనుమతులు, మౌలిక సదుపాయాలు కల్పించాలని, లేకుంటే సిపిఐ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
పేదల జీవన హక్కులను కాలరాసే చర్యలను సిపిఐ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని, గుండ్ల సింగారం ప్రజలకు అండగా పార్టీ నిరంతరం పోరాడుతుందని టి. రామకృష్ణ స్పష్టం చేశారు.