(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం షాద్నగర్ జులై 1
డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలు.. సమగ్ర విచారణ జరపాలి: పానుగంటి పర్వతాలు
షాద్నగర్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట సీపీఐ మహాధర్నా
అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్
ఆర్డీఓ ఎన్.ఆర్. సరితకు వినతిపత్రం సమర్పించిన సీపీఐ నాయకులు
షాద్నగర్, జూలై 1
డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, అర్హులైన పేదలకు వెంటనే ఇళ్లు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు, షాద్నగర్ నియోజకవర్గ కన్వీనర్ పానుగంటి పర్వతాలు డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుద్ధుల జంగయ్య అధ్యక్షతన షాద్నగర్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు, కార్యకర్తలు, బాధితులతో కలిసి మహాధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ ఎన్.ఆర్. సరితకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా పానుగంటి పర్వతాలు మాట్లాడుతూ షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. నిజమైన అర్హులను పక్కనబెట్టి రాజకీయ సిఫార్సులతో అనర్హులకు ఇళ్లు కేటాయించారని విమర్శించారు. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి కమిటీతో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అర్హులైన నిరుపేదలు, వితంతువులు, కూలీ కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో దళారుల జోక్యం పెరగడంతో సంక్షేమ పథకాల లబ్ధి పేదలకు అందడం లేదని ఆరోపించారు.
ధర్నా అధ్యక్షుడు బుద్ధుల జంగయ్య మాట్లాడుతూ కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు వినియోగంలోకి రాక శిథిలావస్థకు చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పేదలు అద్దె ఇళ్లలో, తాత్కాలిక గుడిసెల్లో దుర్భర జీవితం గడుపుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.
చౌదరిగూడ మండల కార్యదర్శి జి. వెంకటేష్, కొత్తూరు మండల కార్యదర్శి ఎం.డి. షకీల్, ఫరూక్నగర్ మండల సహాయ కార్యదర్శి గోవింద్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మహాధర్నాలో మన్సూర్, ఎల్లయ్య, మైసయ్య, యాదగిరి, షబ్బీర్, యాదయ్యతో పాటు నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి వచ్చిన సీపీఐ నాయకులు, కార్యకర్తలు, డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న బాధితులు పాల్గొన్నారు.