Neti Satyam
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 2:32 pm Editor : Admin

పరస్పరం విమర్శలు ఎవరిని మోసం చేసేందుకు..?




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం హైదరాబాద్ జూలై 3

ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించే రాజకీయాలు మానుకోవాలి

కాంగ్రెస్ – బీఆర్ఎస్ పరస్పర విమర్శలతో ప్రజలను మోసం చేస్తున్నాయి

టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు

రాష్ట్రంలో ప్రజలు తీవ్ర సమస్యలతో అల్లాడుతుంటే, కాంగ్రెస్ – బీఆర్ఎస్ పార్టీలు ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలం గడుపుతున్నాయని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు.

నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోంది. రైతులు పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇంటి స్థలాలు అందడం లేదు. తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. కానీ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ సమస్యలను గాలికొదిలేసి పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ నాటకాలు ఆడుతున్నాయని ఆయన మండిపడ్డారు.

ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకే ఈ రాజకీయ విమర్శల డ్రామా కొనసాగుతోందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని, గత పాలనలో చేసిన తప్పులపై బీఆర్ఎస్ కూడా ప్రజలకు జవాబుదారిగా ఉండాలని డిమాండ్ చేశారు.

ప్రజా సమస్యల పరిష్కారమే రాజకీయ పార్టీల ప్రధాన కర్తవ్యమని, విమర్శల రాజకీయాలను విడిచిపెట్టి ప్రజల జీవితాలను మెరుగుపరిచే చర్యలపై దృష్టి పెట్టాలని టి. రామకృష్ణ సూచించారు. లేనిపక్షంలో ప్రజలే తగిన సమయంలో ఈ రెండు పార్టీలకు గట్టి రాజకీయ గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ప్రజల పక్షాన పోరాటమే సిపిఐ లక్ష్యం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని టి. రామకృష్ణ స్పష్టం చేశారు..