(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం చందానగర్ జులై 9
చందానగర్ నుండి మియాపూర్ ఆల్విన్ ఎక్స్ రోడ్ వరకు విద్యార్థుల భారీ ర్యాలీ
జూలై 10 రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ను జయప్రదం చేయాలని డిమాండ్ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
చందానగర్: తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జూలై 10న రాష్ట్రవ్యాప్తంగా కెజీ నుండి పీజీ వరకు విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నామని వామపక్ష విద్యార్థి సంఘాలు ( ఏఐఎఫ్ డి ఎస్ – ఏఐఎస్ఎఫ్– ఎస్ఎఫ్ఐ ) ప్రకటించాయి. ఈ బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ నేడు చందానగర్లోని దీప్తి శ్రీనగర్ నుండి మియాపూర్ ఆల్విన్ ఎక్స్ రోడ్ వరకు విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమి, హాస్టళ్లలో దయనీయ పరిస్థితులు, స్కాలర్షిప్లు మరియు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ, మహిళా విద్యార్థుల భద్రత వంటి అనేక సమస్యలు పేరుకుపోయినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు.
ర్యాలీలో పాల్గొన్న ఏ ఐ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి మాట్లాడుతూ ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని పట్టించుకోకుండా ప్రైవేట్ విద్యాసంస్థల కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం బాధాకరమన్నారు. రాష్ట్రంలోని వేలాది ప్రభుత్వ పాఠశాలలను తగ్గించే ఆలోచనలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు మరియు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ప్రత్యేక విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు.
AIFDS AISF, SFI జిల్లా నాయకులు ముతేన్నగారి శ్రీకాంత్, జే.ధర్మతేజ , టి.నితీష్ బ్యాగరి అరుణ్, మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను పరిరక్షించడం, విద్యార్థుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జూలై 10న జరిగే రాష్ట్రవ్యాప్త బంద్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
బంద్ ప్రధాన డిమాండ్లు:
• ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
• అన్ని విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి.
• హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందించాలి.
• స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
• ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టి ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి.
• మహిళా విద్యార్థుల భద్రత కోసం ప్రతి విద్యాసంస్థలో ఐసీసీ కమిటీలను ఏర్పాటు చేయాలి.
• విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలి.
• కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలి.
• జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ-2020) అమలును నిలిపివేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి.
ఈ ర్యాలీలో ఏ ఐ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి, ఏ ఐ ఎఫ్ డి ఎస్ జిల్లా నాయకులు ముత్తన్నగారి శ్రీకాంత్, అరుణ్, ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి నాయకులు అధ్యక్షుడు కార్యదర్శి జే.ధర్మ తేజ, టీ.నితీష్, టీ .గణేష్,గణేష్ నాయక్,ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్, నాయకులు మాల చందు, సాయి కిరణ్, రేవంత్. రంగారెడ్డి జిల్లా నాయకులు అరుణ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. అలాగే ఏ ఐ ఎఫ్ డి ఎస్ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ నాయకులు ఈశ్వర్ రెడ్డి, జె.డి. గణేష్, శ్రీరామ్, దుర్గాప్రసాద్ తదితరులతో పాటు భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.