(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం హైదరాబాద్ జులై17
నీట్ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి – సోనమ్ వాంగ్చుక్ దీక్షకు సీపీఐ సంపూర్ణ మద్దతు
– టి. రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు
నీట్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం గత 19 రోజులుగా అమరణ దీక్ష కొనసాగిస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేస్తున్న పోరాటానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అత్యంత బాధాకరమని ఆయన విమర్శించారు. విద్యార్థుల ఆందోళనలను అణచివేయడం కాకుండా, వారి న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కార మార్గాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులు తమ హక్కుల కోసం వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి రావడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న ఉద్యమాలను గౌరవించి, సోనమ్ వాంగ్చుక్తో చర్చలు జరిపి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా చర్యలు తీసుకోవాలని టి. రామకృష్ణ డిమాండ్ చేశారు.
విద్య, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ పోరాటానికి ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థి సంఘాలు, ప్రజలు సంఘీభావం ప్రకటించాలని ఆయన పిలుపునిచ్చారు.