(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం హైదరాబాద్ జూలై 22
- డెంగీపై బ్రహ్మాస్త్రం క్యుడెంగా.. అందుబాటులోకి వ్యాధి నివారణ టీకా…
ప్రజారోగ్యానికి సవాలు విసురుతున్న ‘డెంగీ’ మహమ్మారి అంతానికి పరిష్కారం దొరికింది. డెంగీ నివారణకు దేశంలోనే తొలిసారి ఒక టీకా అందుబాటులోకి రాబోతోంది.
జపాన్కు చెందిన ప్రముఖ బయోఫార్మా సంస్థ తకేడా అభివృద్ధి చేసిన ‘క్యుడెంగా’ వ్యాక్సిన్ (టీకా)ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి మంజూరు చేసింది.
ఈ విషయాన్ని తకేడా బయోఫార్మాసూటికల్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ప్రకటించింది.
4 సంవత్సరాల వయసు నుంచి 60 ఏళ్ల వయసు వారి వరకు అందరూ ఈ వ్యాక్సిన్ను తీసుకోవచ్చు.
గతంలో డెంగీ వ్యాధి బారిన పడిన వారు సైతం, ఈ టీకా తీసుకోవడం ద్వారా భవిష్యత్లో దాన్నుంచి దీర్ఘకాలం పాటు రక్షణ పొందొచ్చు.
ఎటువంటి ముందస్తు పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. మూడు నెలల విరామంతో 0.5ఎంఎల్ చొప్పున రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. డెంగీలో నాలుగు ఉప రకాల (సెరోటైప్స్) నుంచి రక్షణనిస్తుంది.
క్యుడెంగా వ్యాక్సిన్ను 2022లో ఆవిష్కరించగా, 43 దేశాలు (భారత్ సహా) అనుమతులు ఇచ్చాయి. ఇప్పటి వరకు 4.3 కోట్ల డోసులను ప్రజలకు ఇచ్చి చూడగా, మంచి ఫలితాలు కనిపించాయి.
ఈ టీకా తీసుకున్న ఏడేళ్ల తర్వాత కూడా, 90 శాతం మందికి డెంగీ కారణంగా ఆస్పత్రిలో చేరకుండా రక్షణ లభించినట్టు తెలిసింది.
ఇప్పటి వరకు ఏడేళ్ల డేటానే అందుబాటులో ఉంది. కానీ, అంతకుమించి దీర్ఘకాలం రక్షణనిస్తుందని తకేడా చెబుతోంది.
పిల్లలు, పెద్దల్లోనూ ఈ టీకా సురక్షితమని, ఎలాంటి దుష్ప్రభావాలు చూపించడం లేదని వెల్లడైంది. ఇప్పటి వరకు డెంగీ నివారణకు చికిత్స ఏదీ లేదు.
వైరల్ జ్వరం బారిన పడి, పరిస్థితి తీవ్రంగా మారినా సాధారణ చికిత్సలతోనే కోలుకునేలా చేస్తున్నారు.