Neti Satyam
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 1:21 pm Editor : Admin

ఐదు రోజులు గడుస్తున్నా బాలయ్య ఆచూకీ ఎక్కడ?




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం శేరిలింగంపల్లి ఆగస్టు ఒకటి

ఐదు రోజులు గడుస్తున్నా బాలయ్య ఆచూకీ ఎక్కడ?

అధికారుల నిర్లక్ష్యంపై సిపిఐ ఆగ్రహం

బాలయ్య ఆచూకీని వెంటనే కనుగొనాలి: టి. రామకృష్ణ

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయిన బాలయ్య ఆచూకీ ఐదు రోజులు గడుస్తున్నా లభించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు.

బాలయ్య నాలాలో పడిపోయి ఐదు రోజులు అవుతున్నా ఆయన ఆచూకీని కనుగొనడంలో అధికారులు విఫలం కావడం బాధాకరమన్నారు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన అధికారులు ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. నాలాల వద్ద రక్షణ చర్యలు, హెచ్చరిక బోర్డులు, భద్రతా ఏర్పాట్లు చేపట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.

బాలయ్య ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసి, అత్యాధునిక పరికరాలు, నిపుణులైన సిబ్బందిని రంగంలోకి దించి వెంటనే ఆచూకీ కనుగొనాలని టి. రామకృష్ణ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి, అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కోరారు.

ఇకనైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని టి. రామకృష్ణ హెచ్చరించారు.