(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం తుక్కుగూడ ఆగస్టు 2
కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలి
ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా 4వ మహాసభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురై ప్రభుత్వానికి పతనం తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఆదివారం జరిగిన ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా 4వ మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల ద్వారా కార్మికులు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న హక్కులను పూర్తిగా కాలరాసిందని ఆయన విమర్శించారు. కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువత ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల కారణంగానే గతంలో రైతులు ఢిల్లీలో చారిత్రాత్మక ఉద్యమం చేపట్టారని, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారని గుర్తు చేశారు. ఈ పోరాటాలన్నీ కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనమని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, విద్యార్థి–యువజన వ్యతిరేక విధానాలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కార్మికుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలోని అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు, కనీస వేతనాల అమలు, ఉపాధి భద్రత కల్పించాలని కోరారు.
అసంఘటిత కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది: ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
మహాసభలో పాల్గొన్న సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ, దేశంలో అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న వారు అసంఘటిత రంగ కార్మికులేనని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మికుల హక్కులను పూర్తిగా కాలరాస్తోందని విమర్శించారు.
కార్మిక చట్టాలను బలహీనపరుస్తూ యజమానులకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల హక్కులను కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు, కార్మిక సంఘాలు, రైతు, విద్యార్థి, యువజన, ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్మికుల ఐక్యత ద్వారానే వారి హక్కులను సాధించుకోవచ్చని పేర్కొన్నారు.
ఈ మహాసభలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ యూసఫ్, సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పానుగంటి పర్వతాలు, రామస్వామి, శేఖర్ రెడ్డి, దత్తు నాయక్, చందు యాదవ్, పబ్బతి లక్ష్మణ్, నరసింహారెడ్డి, ఆర్టీసీ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.