(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం శేరిలింగంపల్లి ఆగస్టు 4
ప్రభుత్వ భూములను అమ్మడం కాదు.. ప్రజా అవసరాలకు వినియోగించాలి
హైడ్రా స్వాధీనం చేసుకున్న 2,665 ఎకరాల్లో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించాలి
ప్రభుత్వానికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ హెచ్చరిక
హైదరాబాద్లో హైడ్రా స్వాధీనం చేసుకున్న సుమారు 2,665 ఎకరాల ప్రభుత్వ భూములను విక్రయించాలని సబ్కమిటీ నిర్ణయించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ తీవ్రంగా ఖండించారు.
ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి అని, వాటిని అమ్మి ప్రభుత్వ ఖజానాను నింపడం కాకుండా ఇల్లు లేని నిరుపేదలు, పేదలు, అర్హులైన పేద కుటుంబాల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి వినియోగించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజధాని హైదరాబాద్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో పేదలకు సొంత ఇల్లు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పేదల కోసం ఉపయోగించాల్సిన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు లేదా రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వ భూములు అమ్మితే కొద్దిమందికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని, అదే భూములను ప్రజా అవసరాలకు వినియోగిస్తే వేలాది నిరుపేద కుటుంబాలకు శాశ్వత నివాసం కల్పించవచ్చని అన్నారు.
హైడ్రా అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకున్న భూములపై ప్రభుత్వం పారదర్శక విధానాన్ని ప్రకటించాలని, భూముల జాబితాను ప్రజల ముందుంచి, వాటిని పేదల ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, పార్కులు, ప్రజా మౌలిక వసతుల కోసం కేటాయించాలని టి. రామకృష్ణ డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించి పేదల ప్రయోజనాలకు అనుకూలంగా చర్యలు తీసుకోకపోతే, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
— టి. రామకృష్ణ
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు