Neti Satyam
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 11:12 am Editor : Admin

పేదల ఇండ్లను కూల్చడం ఆపండి సిపిఐ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం / శేర్లింగంపల్లి/ సెప్టెంబర్3/

శేర్లింగంపల్లిలో పేదల ఇళ్లను కూల్చితే అడ్డుకుంటాం సీపీఐ

కాయ కష్టం , అప్పులు చేసి కట్టుకున్న ఇళ్లను కూల్చడం దుర్మార్గం – పేదలను రోడ్డున పడేసే చర్యలను వెంటనే నిలిపివేయాలి

టి. రామకృష్ణ
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు,
శేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి

శేర్లింగంపల్లి నియోజకవర్గంలో పేద, మధ్యతరగతి ప్రజలు ఎన్నో సంవత్సరాలు కాయ కష్టం చేసి, అప్పులు చేసి, తమ రక్తాన్ని చెమటగా మార్చి నిర్మించుకున్న ఇళ్లను హైడ్రా పేరుతో కూల్చివేయడానికి ప్రయత్నిస్తే సీపీఐగా చూస్తూ ఊరుకోబోమని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు, శేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి టి. రామకృష్ణ హెచ్చరించారు.

పేదవాడి ఇల్లు కేవలం నాలుగు గోడలు కాదని, అతని జీవితకాలపు కష్టానికి ప్రతీక అని అన్నారు. ఎన్నో ఏళ్ల కష్టార్జితాన్ని పెట్టి, అప్పులు చేసి కట్టుకున్న ఇంటిని ఒక్కసారిగా కూల్చివేస్తే ఆ కుటుంబం గుండె పగిలిపోయే రోదనతో రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

పేదల ఇళ్లపై హైడ్రా బుల్డోజర్లు నడపడం అభివృద్ధి కాదు. పేదల జీవితాలపై దాడి. అక్రమ నిర్మాణాల పేరుతో పేద, బడుగు, బలహీన వర్గాల నివాసాలను లక్ష్యంగా చేసుకోవడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైనా నిర్మాణంపై చట్టపరమైన అభ్యంతరాలు ఉంటే ముందుగా పూర్తి స్థాయిలో విచారణ జరిపి, బాధితులకు నోటీసులు ఇచ్చి, తమ వాదనను వినిపించే అవకాశం కల్పించిన తర్వాతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పి, మరోవైపు వారు కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం ఏ విధమైన ప్రజాపాలన అని ప్రశ్నించారు. పేదల కన్నీళ్లపై ప్రభుత్వం అభివృద్ధి భవనాలు నిర్మించాలనుకోవడం సరికాదన్నారు.

బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం, పేదల నివాస హక్కు కోసం సీపీఐ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. శేర్లింగంపల్లిలో పేదల ఇళ్లను కూల్చేందుకు హైడ్రా అడుగు ముందుకు వేస్తే సీపీఐ అడుగు అడ్డుగా నిలుస్తుందని, ప్రజలను సమీకరించి ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.

ప్రభుత్వం, హైడ్రా అధికారులు వెంటనే పేదల ఇళ్ల కూల్చివేతలపై పునరాలోచించాలని, ఇప్పటికే భయాందోళనలో ఉన్న కుటుంబాలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.

“పేదల ఇళ్లు కూల్చొద్దు – పేదల జీవితాలను రోడ్డున పడేయొద్దు.
ఇల్లు కాపాడుకునే పోరాటంలో సీపీఐ ప్రజల పక్షాన నిలుస్తుంది.” టి రామకృష్ణ