లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో రెవెన్యూ ఇన్స్పెక్టర్*
నల్గొండ జిల్లా : గుర్రంపోడ్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ హకీం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
సోమవారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంట ప్రాంతంలో గుర్రంపోడ్ మండల ఎంఆర్వో కార్యాలయ ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం… బాధితుడికి చెందిన సర్వే నెంబర్ 225/6లోని ఎకరాలు 1.15 గుంటల భూమికి సంబంధించి, ఆన్లైన్ 1-బి రిజిస్టర్ (ఆర్ఓఆర్)లో తొలగించబడిన భూమి వివరాలను తిరిగి చేర్చేందుకు బాధితుడు దరఖాస్తు చేసుకున్నాడు.
ఆ దరఖాస్తును ప్రాసెస్ చేసి తహసీల్దార్కు పంపించేందుకు గాను రెవెన్యూ ఇన్స్పెక్టర్ రూ.2,20,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలో లంచం మొత్తంలో భాగంగా రూ.20,000 స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు కార్యాలయంలోనే దాడి చేసి అతడిని పట్టుకున్నారు.
లంచం నగదును అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, విధులను అక్రమంగా , అనైతికంగా నిర్వహిస్తూ అనుచిత లాభం పొందినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై నిందిత అధికారిని అరెస్టు చేసి, హైదరాబాద్లోని అదనపు ప్రత్యేక న్యాయమూర్తి (ఎస్పీఈ & ఏసీబీ కేసులు) కోర్టు ముందు హాజరుపరిచారు.
ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలో ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారు పేరు, వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.