ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమైనది — సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం….
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె న్యాయబద్ధమైనదని సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తెలిపారు.
ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని,ప్రభుత్వం వెంటనే స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం,ఉద్యోగ భద్రత, వేతన సవరణ, ఖాళీ పోస్టుల భర్తీ, కార్మికులకు సంబంధించిన సంక్షేమ అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని, కరోనా కాలంలో కూడా ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన కార్మికుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు. కార్మికుల సమ్మెను అణిచివేయడానికి ప్రయత్నించడం కాకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించారు.
సిపిఐ ఎల్లప్పుడూ కార్మిక వర్గాల పక్షాన నిలుస్తుందని, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన పోరాటానికి పూర్తి మద్దతు కొనసాగిస్తామని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం స్పష్టం చేశారు..