నేటి సత్యం నాగర్ కర్నూల్ ఆగస్టు మూడు
దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
*దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కిరణ్ కుమార్, బండి లక్ష్మీపతి డిమాండ్*
దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర సమితి పిలుపు మేరకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దళిత హక్కుల పోరాట సమితి నాగర్ కర్నూల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కిరణ్ కుమార్ బండి లక్ష్మీపతి పాల్గొని మాట్లాడుతూ దళిత సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
*ప్రధాన డిమాండ్లు:*
అంబేద్కర్ అభయహస్తం పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి ₹12 లక్షల సంక్షేమ నిధులను వెంటనే విడుదల చేయాలి.
దశాబ్దాలుగా దళితులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములపై పరిమితులను తొలగించి, సంపూర్ణ యాజమాన్య హక్కులు (పట్టాలు) కల్పించాలి. బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో దళిత కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి ,
ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించకుండా, దళితుల విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల కోసం పూర్తిస్థాయిలో విడుదల చేయాలి.
నిరుపేద దళితులకు ఇండ్ల స్థలాలు కేటాయించి, తక్షణమే పట్టాలు పంపిణీ చేయాలి.
డప్పు కళాకారులకు అధికారిక గుర్తింపు కార్డులు అందజేసి, నెలకు ₹10,000 గౌరవ వేతనం అందించాలి.
స్వయం ఉపాధి, చిన్న పరిశ్రమల కోసం దరఖాస్తు చేసుకున్న ఎస్సీ లబ్ధిదారులకు పెండింగ్లో ఉన్న ఇండస్ట్రియల్ రుణాల సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలి.
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువకులకు వెంటనే రుణాలను మంజూరు చేయాలి
ప్రభుత్వం దళితుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు. అనంతరం నాగర్ కర్నూల్ జిల్లా జాయింట్ కలెక్టర్
చెన్నయ్య గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర సమితి సభ్యులు వంకేశ్వరం శ్రీనివాసులు, డి హెచ్ పి ఎస్ జిల్లా సమితి సభ్యులు కొత్త రామస్వామి, చిన్నపాగా శ్రీను, బాల పేరు, శివశంకర్, కురుమయ్య, పేరుమలి శ్రీను, దుర్గ, బండి బాల పేరు తదితరులు పాల్గొన్నారు