నేటి సత్యం శేర్లింగంపల్లి జూన్ 3
కమ్యూనిస్టులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు
కమ్యూనిస్టు ఉద్యమాలపై, కమ్యూనిస్టు నాయకులపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తీవ్రంగా ఖండిస్తున్నది. దేశ స్వాతంత్ర్య ఉద్యమం నుంచి నేటి వరకు కార్మికులు, రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీలది. అలాంటి ఉద్యమాలపై అవగాహన లేకుండా మాట్లాడటం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.
దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల భారం, రైతుల ఆత్మహత్యలు, కార్మికుల సమస్యలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వంటి ప్రజా సమస్యలపై పోరాడాల్సిన నాయకులు కమ్యూనిస్టులపై విమర్శలు చేయడం దురదృష్టకరం. ప్రజల పక్షాన నిలబడిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీలది కాగా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించే శక్తులు కమ్యూనిస్టుల త్యాగాలను ప్రశ్నించడం హాస్యాస్పదం.
ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గ హక్కుల కోసం జరిగిన ప్రతి పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం నుంచి నేటి వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టులు ముందుండి పోరాడుతున్నారు. అలాంటి ఉద్యమ వారసత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలను ప్రజలు ఎప్పటికీ అంగీకరించరు.
పవన్ కళ్యాణ్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని కమ్యూనిస్టు ఉద్యమాలకు, ప్రజాస్వామ్య విలువలకు క్షమాపణ చెప్పాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నది. ప్రజల సమస్యలపై చర్చించకుండా కమ్యూనిస్టులపై దాడులు చేయడం ద్వారా తన రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం మానుకోవాలని హెచ్చరిస్తున్నాం.