‘*బద్లావ్ జరూరీ హై’ సభ విజయవంతం – సీపీఐ కేంద్ర కార్యాలయంలో సంబరాలు*
నేటి సత్యం హైదరాబాద్, సెప్టెంబర్ 2: సీపీఐ జాతీయ సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ‘బద్లావ్ జరూరీ హై’ నినాదంతో నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతమైన సందర్భంగా సీపీఐ కేంద్ర కార్యాలయం అజయ్ భవన్లో సంబరాలు నిర్వహించారు.
ఉస్మానియా యూనివర్సిటీ మాజీ జాయింట్ రిజిస్ట్రార్ ఉప్పరి ఎల్లేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఈటీ నరసింహ, తక్కలపల్లి శ్రీనివాసరావు సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఉప్పరి ఎల్లేష్ మాట్లాడుతూ, ‘బద్లావ్ జరూరీ హై’ నినాదంతో సీపీఐ జాతీయ సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు దేశవ్యాప్తంగా ప్రజలు, కార్మికులు, రైతులు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయడం అభినందనీయమన్నారు.
దేశంలో ప్రజా సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయని, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ప్రజల హక్కులు, సామాజిక న్యాయం, ఉపాధి, విద్య, వైద్యం, రైతులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమూల మార్పు అవసరమని పేర్కొన్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను పరిరక్షించేందుకు వామపక్ష శక్తులు మరింత ఐక్యంగా ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘బద్లావ్ జరూరీ హై’ నినాదం కేవలం ఒక సభకు పరిమితం కాకుండా, ప్రజల సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా కొనసాగాల్సిన ప్రజా ఉద్యమానికి నాంది కావాలని ఉప్పరి ఎల్లేష్ ఆకాంక్షించారు.
సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరిగిన భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన సీపీఐ జాతీయ నాయకత్వానికి, దేశవ్యాప్తంగా తరలివచ్చిన పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవైన శంకర్, హేమంతరావు, సీపీఐ కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా, ఏఐఎస్ఎఫ్ నాయకులు రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.