నేటి సత్యం శేరిలింగంపల్లి జూలై8
ఏనుమరేషన్ ఫారాలు ఇప్పటికీ అందలేదు – ఆందోళనలో ఓటర్లు
ఫారాలు ఇచ్చే గడువును *నెలరోజులు పొడిగించాలి
టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు
రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా పంపిణీ చేయాల్సిన ఏనుమరేషన్ ఫారాలు ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఓటర్లకు అందకపోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ పేర్కొన్నారు. ఫారాలు అందకపోవడంతో వేలాది మంది ఓటర్లు తమ పేర్లు జాబితాలో కొనసాగుతాయో లేదో అనే అనిశ్చితిలో ఉన్నారని అన్నారు.
గ్రామాలు, కాలనీలు, పట్టణ ప్రాంతాల్లో బూత్ స్థాయి సిబ్బంది సరైన విధంగా ఫారాలు పంపిణీ చేయకపోవడం వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, కార్మికులు, పేద కుటుంబాలు, అద్దె ఇళ్లలో నివసించే వారు, ఉద్యోగరీత్యా బయటకు వెళ్లే ప్రజలు ఈ ప్రక్రియలో వెనుకబడే ప్రమాదం ఉందన్నారు.
ఓటు హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు అని, పరిపాలనా లోపాల కారణంగా ఒక్క ఓటరైనా నష్టపోకూడదని టి. రామకృష్ణ స్పష్టం చేశారు. అందువల్ల ప్రభుత్వం, ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని ఏనుమరేషన్ ఫారాలు పూర్తిగా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే ప్రస్తుత గడువు సరిపోదని, ప్రజలకు తగిన సమయం కల్పించేందుకు ఏనుమరేషన్ ఫారాలు సమర్పించే గడువును కనీసం మరో నెలరోజులు పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి ఇంటికి ఫారం చేరే వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కోరారు.
ప్రజల ఓటు హక్కును కాపాడడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా ఆందోళనలు చేపడతామని టి. రామకృష్ణ హెచ్చరించారు.