నేటి సత్యం శేరిలింగంపల్లి జూలై 18
*సోనమ్ వాంగ్ చుక్ దీక్ష భగ్నానికి ప్రయత్నించటం*
*కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం*
*సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ*
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ నేడు పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్ళటాన్ని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యత వహించాలని శాంతియుతంగా దీక్ష చేస్తున్నప్పటికీ స్పందించకుండా, బెదిరింపు ధోరణితో భగ్నం చేయటానికి ప్రయత్నించటం కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వాన్ని సూచిస్తోంది. పేపర్ లీకేజీ కారణంగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు లేవనెత్తే అంశాలపై స్పందించటం ప్రభుత్వాల కనీస బాధ్యత అని, పలువురు విద్యార్థులతో సహా సోనమ్ వాంగ్ 20 రోజులకు పైగా దీక్ష చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చర్చలకు ప్రయత్నించకపోవడం అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. దీక్షను బలవంతంగా భగ్నం చేయడం కాదని, సమస్య పరిష్కారానికి చొరవ చూపెట్టే హామీ ఇచ్చి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వం న్యాయం చేసినట్లుగా భావించవచ్చునన్నారు. ఆయన ప్రాణాలను కాపాడడం చాలా అవసరమని, అదే సమయంలో కోర్టును అడ్డం పెట్టుకొని సమస్య పరిష్కరించకపోవడం నిరంకుశత్వమని అన్నారు. పోలీసులు ఆసుపత్రికి తరలించిన వాంగ్ చుక్ అనుమతి లేకుండా దీక్షను భగ్నం చేయవద్దని టి. రామకృష్ణ డిమాండ్ చేశారు.