నేటి సత్యం ఆగస్టు 12 శాస్త్రి
భారత సాంస్కృతిక పరిణామంలో సనాతనత్వం, శాస్త్రీయ మానవత.. –ఎ అజ శర్మ
ఇటీవల కాలంలో సనాతనం అనే పదం తరచుగా వినపడుతోంది. సనాతనం అంటే హిందూ దేవతల ఆరాధన మాత్రమే అన్న భావం కొంతమందిలో ఉంది. అంత మేరకే పరిమితమయితే ప్రమాదం లేదు. కానీ, సనాతనం పేరున సమాజాన్ని వెనక్కు నెట్టే కొన్ని ప్రమాదకర చర్యలు నేడు జరుగుతున్నాయి. వీటిని వ్యతిరేకించేవారిని హిందూ మత వ్యతిరేకులుగా కూడా ముద్ర వేస్తున్నారు. దీని వెనుక ఉన్న నిగూఢార్థాలను తెలుసుకోవాలంటే కొన్ని వాస్తవాలను పరిశీలించాలి.
భారత నాగరికత వేల సంవత్సరాల చరిత్ర కలిగినది. ఈ చరిత్రలో ఒక వైపు సనాతన సంప్రదాయాల బలం, మరోవైపు వాటిని సవాలు చేసిన తర్కబద్ధ, శాస్త్రీయ మానవతా ప్రవాహాల మధ్య నిరంతర పోరాటం సాగింది. అదే భారత సాంస్కృతిక పరిణామ అసలైన చైతన్య రేఖ.
“సనాతనం” అనే పదం సంస్కృత మూలమైంది. దీని అర్థం సులభంగా చెప్పాలంటే — శాశ్వతం, ఎప్పటినుండో ఉన్నది అనే భావం. అంటే కాలం మారినా మారని, ఎప్పటికీ ఉండే ధర్మం లేదా వ్యవస్థ. హిందూ ధర్మం అనే పేరుతో ఎక్కువగా పిలుస్తున్నారు.
అంటే వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులు, పురాణాలు మొదలైన వాటి మీద ఆధారపడి ఉన్న జీవన విధానం. కానీ మొదట్లో సనాతన ధర్మం అనే పదం ఏక మతం కంటే పెద్దది. ఇది మనిషి నడవాల్సిన శాశ్వత నైతిక మార్గం, సమాజ ధర్మం, ప్రకృతి ధర్మం అన్నట్లుగా విస్తృతంగా ఉండేది.
ఇప్పుడు “సనాతనం” అనే పదానికి రెండు విధాల వాడుక ఉంది. ఒకటి ఆధ్యాత్మిక తాత్విక అర్థం. ఇది శాశ్వత సత్యాలు, నైతిక విలువలు, ధర్మం, కర్మ సిద్ధాంతం మొదలైన వాటిని సూచిస్తుంది.
రెండోది సాంప్రదాయ లేదా రాజకీయ అర్థం. “సనాతనం” అనే పదాన్ని పాత సామాజిక వ్యవస్థలోని కుల వ్యవస్థ, జాతి ఆధారిత హక్కులు, మహిళలపట్ల వివక్షతను కాపాడటానికి వాడుతున్నారు. దీనివల్లే సమాజానికి అసలు ప్రమాదం.
సనాతనత్వం వర్సెస్ శాస్త్రీయ దృక్పథం..
ఈ సనాతన వాదులు భావించినట్లు ఈ సృష్టిలో ఏదీ శాశ్వతంగా ఉండదు, ప్రతిదీ నిరంతరం చలనంలో ఉంటుంది అన్నది శాస్త్రం చెబుతుంది.
కులవ్యవస్థ, మహిళపట్ల వివక్షత వంటివి ఆరెస్సెస్ ప్రబోధించే మనుధర్మ సిద్ధాంతాలు. దీన్నే సనాతనం కింద ప్రచారం చేస్తున్నారు.
నేటి సమాజంలో పేదరికం, నిరుద్యోగం, ఆదాయ అంతరాలు, మనుషుల మధ్య తేడా వంటి ప్రజల ఈతి బాధలకు కారణం, జన్మ ఆధారంగా ఉందని సనాతనం చెబుతుంది. శూద్రుడు బ్రాహ్మణునికి సేవ చేయాలి అని పేర్కొంది. కింది వర్ణాలు అశుద్ధులు అని పరిగణించి, అస్పృశ్యత ఏర్పడింది. మనుస్మృతి లాంటి గ్రంథాలు దీన్ని సమర్థించాయి.
దీనికి భిన్నంగా అందరూ జన్యుపరంగా సమానులేనని, ఎవరి తెలివి, ప్రతిభ, కృషి వంటివే వ్యక్తిని నిర్ణయిస్తాయి తప్ప జన్మ కాదు అని శాస్త్రం చెబుతుంది. మన ఆధునిక రాజ్యాంగం కూడా ఆర్టికల్ 14-18 ద్వారా సమానత్వ హక్కు ఇచ్చింది. ఇది సనాతనం అనే భావనకు విరుద్ధం. అందుకే వీరు భారత రాజ్యాంగాన్ని కూడా సవాలు చేస్తున్నారు.
సనాతన దృక్పథం మహిళను పతివ్రతగా వర్ణించి పురుషాధీనంగా చూపింది. విద్య, వారసత్వం, ఆస్తి హక్కులు వంటివి పరిమితం చేసింది. పతి దేవుడు అన్న భావనతో, ఆమె స్వేచ్ఛను నియంత్రించింది. దీనికి భిన్నంగా శాస్త్రీయ దృక్పథం మహిళలు పురుషుల్లాగే మెదడు, భావజాలం, సామర్థ్యం కలవారని నిరూపించింది.
విద్య, ఉపాధి, సమాన వేతనం, రాజకీయ ప్రాతినిధ్యం వంటివన్నీ సమానంగా ఉండాలని చెబుతుంది.