నేటి సత్యం / శేరిలింగంపల్లి/ ఆగస్ట్ 25
నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే నియంత్రించాలి
ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలపై పెరుగుతున్న భారాన్ని తగ్గించాలి
టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు
రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్య ప్రజల జీవనాన్ని దుర్భరంగా మారుస్తున్నాయని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయలు, పప్పులు, నూనెలు, బియ్యం, పాలు తదితర నిత్యావసర వస్తువులతో పాటు చక్కెర ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన విమర్శించారు.
“చక్కెర పేరు వింటేనే చెమటలు పట్టే పరిస్థితి ఏర్పడింది” అని ఆయన ఎద్దేవా చేశారు. ధరల పెరుగుదలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాటలకే పరిమితం కాకుండా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు ఉపశమనం కల్పించాల్సిన ప్రభుత్వాలు ధరల నియంత్రణలో విఫలమవుతున్నాయని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని అన్నారు. సామాన్య ప్రజల కొనుగోలు శక్తి రోజురోజుకు పడిపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టి, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత, నల్లబజారు, దళారుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్కెట్పై సమర్థవంతమైన పర్యవేక్షణ చేపట్టి ప్రజలకు తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజలపై ధరల భారాన్ని మోపుతూ కార్పొరేట్, దళారీ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తే సిపిఐ ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలపై మరింత బలమైన ప్రజా ఉద్యమాలను చేపడుతుందని టి. రామకృష్ణ హెచ్చరించారు.
నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి – ప్రజలపై ధరల భారాన్ని మోపడం ఆపాలి – నల్లబజారు, దళారీ దోపిడీని అరికట్టాలి అని ఆయన డిమాండ్ చేశారు.