గన్నేరువరంలో ఘనంగా ప్రజా పాలన ప్రగతి, ప్రణాళిక మండల సభ
గన్నేరువరం, ఏప్రిల్ 16: (నేటిసత్యం):ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల సభను నిర్వహించారు. మండల స్పెషల్ ఆఫీసర్, జిల్లా సంక్షేమ అధికారిణి శ్రీమతి సరస్వతి పర్యవేక్షణలో, ఎంపీడీఓ ఏ. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ పథకం, గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న వడ్లకు బోనస్ చెల్లింపు వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అలాగే చేయూత పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలు, ఇందిరా మహిళా శక్తి ద్వారా స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ, కొత్త రేషన్ కార్డుల మంజూరు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. మండలంలో విద్య, వైద్య సౌకర్యాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కనకయ్య, ఎస్ఐ నరేందర్, ఎంపీఓ సురేందర్, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గౌరవ సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు మరియు ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు.