నేటి సత్యం జూలై 30
పరవాడ గ్రామ అభివృద్ధే నా లక్ష్యం – సర్పంచ్ అభ్యర్థి షేక్ ఇస్మాయిల్
అనకాపల్లి జిల్లా పరవాడ: పరవాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న మైనార్టీ అభ్యర్థి షేక్ ఇస్మాయిల్ మాట్లాడుతూ, గ్రామ ప్రజల ఆశీస్సులతో గ్రామాభివృద్ధి కోసం ఎన్నికల బరిలోకి దిగినట్లు తెలిపారు.
గ్రామంలో ఎన్నో ఏళ్లుగా తాగునీటి సమస్య, మురుగు కాలువల నిర్వహణ లోపం, పారిశుద్ధ్య సమస్యలు, రహదారుల దుస్థితి, స్మశానవాటిక సౌకర్యాల కొరత, నిరుద్యోగం, పేదల సంక్షేమ పథకాల అమలులో లోపాలు వంటి అనేక సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయని అన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోవడం కంటే కొంతమంది నాయకులు పార్టీలు మారడానికే ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు.
ప్రజల కోసం రావాల్సిన అభివృద్ధి నిధులు పారదర్శకంగా వినియోగం కాలేదని, గ్రామాభివృద్ధికి కావాల్సిన చర్యలు సక్రమంగా చేపట్టలేదని ఆయన పేర్కొన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించిన వారిపై అనవసర ఆరోపణలు చేయడం కూడా బాధాకరమని అన్నారు.
తాను సర్పంచ్గా ఎన్నికైతే గ్రామంలో పారదర్శక పాలన, అవినీతికి తావులేని పరిపాలన, ప్రతి వార్డుకు సమాన అభివృద్ధి, యువతకు ప్రాధాన్యం, మహిళల సంక్షేమం, తాగునీరు, పారిశుద్ధ్యం, మురుగు కాలువలు, వీధి దీపాలు, రోడ్లు, స్మశానవాటిక అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.
“పరవాడను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం నా లక్ష్యం. ప్రజల సమస్యలను నేరుగా విని, అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరిస్తాను. గ్రామంలో మార్పు, అభివృద్ధి కోరుకునే ప్రతి ఓటరు ఈ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటుతో నన్ను ఆశీర్వదించి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను” అని షేక్ ఇస్మాయిల్ విజ్ఞప్తి చేశారు.
— షేక్ ఇస్మాయిల్