గన్నేరువరం గ్రామ పంచాయతీలో ముగిసిన 99 రోజుల ప్రణాళిక గ్రామసభ
గన్నేరువరం, 10 జూన్ (నేటి సత్యం): గన్నేరువరం మండల పరిధిలోని గ్రామ పంచాయతీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం నేటితో ముగిసింది. ఈ ముగింపు సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామంలో ప్రత్యేక గ్రామసభను నిర్వహించారు. ప్రజా పాలనలో భాగంగా జరిగిన ఈ సభకు గ్రామానికి చెందిన మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతల ప్రాధాన్యతను, భూగర్భ జలాల పెంపునకు అవి ఎలా దోహదపడతాయో వివరించారు. అలాగే ఇండ్ల నుండి వెలువడే తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని ఎలా మెరుగుపరచవచ్చో తెలియజేశారు. గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అనంతరం వివిధ కార్యక్రమాలపై సభకు హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరేందర్ రెడ్డి , ఎంఈఓ కే రామయ్య, విద్యుత్ లైన్మెన్ యాదయ్య, ఎంపీఓ సురేందర్ , హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తన సిబ్బంది, ప్రత్యేక అధికారి లతో పాటు స్థానిక సర్పంచ్ లచ్చినర్సు పంచాయతీ కార్యదర్శి వెంకటరెడ్డి, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు, మహిళా సంఘాలు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.